18, జనవరి 2018, గురువారం

మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -2

క్రిందటి టపాలో మోచర్ల వెంకన్న గారిని గురించీ వారు సమస్యాపూరణాలు చేసిన సందర్భం గురించీ తెలుసుకున్నాం. 

మొదట ఆ టపాలోని విషయాల మీదే కొంత చర్చించుకోవాలి.

పైపైన చదివిన వారికి రాజుగారు తెలుగుభాషాభిమాని అనీ సంస్కృతం అంటే పెద్దగా అదరం లేనివాడనీ అనిపించే అవకాశం ఉంది. అందరికీ కాకపోయినా కొందరికి అలాంటి అభిప్రాయం కలిగితే ఆశ్చర్యం లేదు. కాని అది సరైన అభిప్రాయం కాదని నా మనవి.

రాజుగారు నిస్సందేహంగా ఆంధ్రభాషాభిమాని. 

ఐతే కవులూ పండితులూ సంస్కృతానికి పెద్దపీటవేసి తెలుగును ద్వితీయశ్రేణిభాషగా చూడటం ఆయనకు బహుశః సమ్మతం కాదని అనుకుంటాను.

కాని అప్పటి కాలమాన పరిస్థుతులను పరిశీలిస్తే సంస్కృతభాషలో మంచి పాండిత్యం ఉన్నవారికి యావద్భారత దేశంలోనూ చెలామణీ బాగుండేది. అసేతుహిమాచలమూ వారు సునాయాసంగా సన్మానాలందుకుంటూ సుఖజీవనం చేయటానికి ఆస్కారం ఉండేది.

కాని తెలుగుకవులూ తెలుగుపండితులూ మాత్రం కొంత ఇబ్బందిలో ఉండేవారనే చెప్పాలి, నిజం చెప్పాలంటే తెలుగుపండితులు అన్న ప్రసక్తి ఉండేదే కాదప్పట్లో.  తెలుగులో దిట్టంగా కవిత్వం చెప్పగల వాళ్ళకు మాత్రం తెలుగుకవులన్న ఆదరం ఉండేది.

నిజానికి ఇప్పట్లా తెలుగులో కవిత్వం చెప్పటం ఒక బ్రహ్మండమైన విషయంగా ఉండేదే కాదు. అందరూ సాంప్రదాయికమైన పద్ధ్హతిలో మొదట సంస్కృతాంధ్రాలు పంచకావ్యాదులు యధాశక్తి చదువుకొనే వారు. స్వతంత్రంగా చాలామందే అంతో ఇంతో సంస్కృతంలో శ్లోకాలూ తెలుగులో పద్యాలూ చెప్పగలిగి ఉండేవారు.

ఐతే కొందరు మాత్రమే రసవంతమైన కవిత్వం చెప్పగల శక్తిని కలిగి ఉండేవారు.  సంస్కృతంలో అనుష్టుప్పులు చెప్పటం ఎంత తేలికంటే సంస్కృతం రాని నేనుకూడా కొద్దిగా గిలకగలను! అటువంటప్పుడు పద్దతిగా సంస్కృతాభ్యసనం చేసిన వారు చాలామందే సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలిగి ఉంటారు కదా! అందుకు సందేహం అక్కరలేదు కదా.

ఇకపోతే సంస్కృతపండితులంటే వ్యాకరణతర్కమీమాంసాదుల్లో గురుశుశ్రూషను బహుకాలం చేసి గడితేరిన వారు. వారికి శాస్త్రపాండితి విస్తరించి ఉంటుంది. కాని ఎంతగా భాషమీదో ఏదైనా శాస్త్రం మీదో పట్టున్నంత మాత్రాన రసవంతంగా కవిత్వం చెప్పగలగటం కుదరదు.  దానికి కావలసిన  ఆసక్తీ ఆశక్తీ ఆ అభినివేశమూ వేరు, దానికి కావలసిన సామాగ్రి వేరు దానికి కావలసిన పరిశ్రమ వేరు. 

ఆరోజుల్లో ఎవరెవరో దేశం నలుమూలల నుండీ వచ్చి తమ శాస్త్రవైదుష్యాన్ని ప్రదర్శించి రాజసన్మానాలు కొనిపోయేవారు. సంస్థానాల సొమ్ముల్లో ఈవిధంగా బాగానే వెచ్చం అయ్యేది ఉండేది.

సంస్థానాల్లో తెలుగుకవులకూ గౌరవం దక్కేదా అంటే దక్కేదనే చెప్పాలి. కాని సంస్కృతకవిపండితులు దిగ్దంతులట్టివారు వచ్చి బహుమతు లందుకొంటున్నపుడు తెలుగుకవుల్లో కూడా అటువంటి స్థాయి చూపగలవారికే కదా అంతపెద్ద పెద్ద సన్మానాలకు యోగ్యత ఉండేది? 

కాని ఎందుకనో కాని తెలుగువారికి కీర్తికండూతి తక్కువనే చెప్పాలి. పైగా తెలుగుమాత్రమే కవిత్వసాధనంగా ఉన్నవాళ్ళు దేశాటనం చేయటం కుదిరే పని కాదే. ఎంతగా కవిత్వసంపద ఉన్నా అనేకులు కావ్యనిర్మాణం జోలికి పోయే వారు కా దనిపిస్తుంది. అందుకు మోచర్లవారే ఉదాహరణ.

అందుచేత రాజయాచేంద్రునికి తెలుగుకవి అయిన వాడికి ఏదన్నా సన్మానం చేదామన్నా అంత స్థాయి కవి తటస్థపడేది తక్కువ గానూ, సంస్కృత కవిపండితులైన వాళ్ళు తారసపడేది ఎక్కువగానూ ఉండేది అని చెప్పటానికి ఇబ్బంది లేదు. ఈ రాజుగారు స్వయంగా కవిత్వం చెప్పగల సమర్థుడు కావచ్చును. అదేమీ కొత్తవిషయం కాదు.  సాధారణంగా రాజులు కూడా సంస్కృతాంధ్రాలు బాగానే చదువుకొనే వారు. వారిలో అనేకులు స్వయంగా కొద్దో గొప్పో కవులుగానూ ఉండేవారు. బయట ఏవోకొన్ని జనాంతికంగా చాటుపద్యాలు చెప్పేవాళ్ళు అటువంటి రాజులవద్ధ కూసువిద్యను ప్రదర్శించి ఆమోదం పొందటం కుదరదు.

ఇప్పుడు చూదాం రాజుగారు వయ్యాకరణిని ఎందుకు నిరాదరించిందీ.
రాజుగారు అడిగినది తెలుగులో కవిత్వం చెప్పగలరా అని.

సంస్కృతంలో కొంచెంగా శ్లోకాలు చెప్పగలగటం అప్పుడూ పెద్దవిషయం కాదు - ఇప్పుడూ పెద్దవిషయం కాదు.
ఆయన సంస్కృతంలో దిట్టంగా చెప్పగలను అన్నా రాజాదరం దొరికి ఉండేదేమో.

కొంచెం శ్లోకాలైతే చెప్పగలను అనేసరికి రాజుగారికి నచ్చలేదు ఆసమాధానం. సభలోవారూ నవ్వుకొని ఉంటారు.

ఐతే రాజుగారి ఆంధ్రభాషాభిమానం ఒక మంచి మాటను అనిపించిది తెనుగెరుగడు సంస్కృతంపు తెన్నేమెరుగున్ అని.

ఈరోజుల్లో అందరూ అంటున్నారు కదా. శాస్త్రవేత్తలేమీ సామాన్యులేమీ. ముందు మాతృభాష అనేది క్షుణ్ణంగా వస్తేనే మరొక భాష బాగా వస్తుందీ అని. రాజుగారు అచ్చంగా ఆభావాన్నే వెలిబుచ్చారంతే.

ఐతే రాజుగారి వలన జరిగిన అపరాథమూ పెద్దదే. వచ్చింది వయ్యాకరణి. చేతనైతే తనూ కాకపోతే సభలో ఎవరైనా మంచి వయ్యాకరణులూ వచ్చిన పెద్దమనిషితో కొద్దిసేపు ముచ్చటించి తగిన విధంగా సత్కరించాలి. లేదా అయ్యా మా దగ్గర వయ్యాకరణులు ఎవరూ లేరూ, మీ అంత వారు వచ్చారూ అదే మా భాగ్యం అని చెప్పి ఏదన్నా మంచిబహుమానం ఇచ్చిపంపాలి. 

నాకు కవిత్వం కావాలయ్యా వ్యాకరణం కాదూ, అదీ కాక తెలుగుకవిత్వమే కావాలీ పో అనటం పండితావమానమే. ఆ కారణంగానే వెంకన్నగారికి కోపం వచ్చింది.

ఇప్పుడా పండితుడు దేశసంచారం చేస్తూ ఫలాన వేంకటగిరి సంస్థానాధీశుడు వట్టి పొగరుబోతు. నాకు తెలుగుకవిత్వం రాకపోవటం ఏదో గొప్ప తప్పూ అన్నట్లుగా తిట్టి వెళ్ళగొట్టాడూ అని దేశం అంతా టముకు వేస్తే రాజుగారి పరువు పోతుంది. సంస్థానం ప్రతిష్ట దెబ్బతింటుంది.

అందుకనీ రాజగౌరవమూ రాజ్యగౌరవమూ నిలపాలనే వెంకన్న గారు కోపం ధరించారు.

ఇంకొంచెం వ్రాయవలసి ఉంది మన్నించాలి, టపా ఇప్పటికే పెద్దదైనది కదా. అందుకని తాత్కాలిక విరామం!  We will be right back after the break అన్న మాట.