31, జులై 2017, సోమవారం

ప్రబంధాల్లో ప్రాసయతి ప్రయోగాలు - 2

ఇప్పుడు ఈ పరిశీలనలో రెండవ భాగం మొదలు పెడదాం.

తెలుగులో పంచకావ్యాలని పేరుపడ్డవి కొన్ని ప్రబంధాలున్నాయి. అవి మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగమాహాత్మ్యము, పారిజాతాపహరణము అనేవి.

వరుసగా వీలైనన్ని ప్రబంధాలను చూడాలని అనుకుంటున్నాం‌ కదా. అందులో ఈ‌పంచకావ్యాలనూ‌ ముందుగా చూదాం. ఇప్పటికే మను, వసు చరిత్రములను చూడటం‌ జరిగింది.

ఈ‌భాగంలో ఆముక్తమాల్యదను పరిశీలిద్దాం.

అన్నట్లు ఇప్పటిదాకా ఈ ఐదురోజుల్లోనూ‌ కలిపి మొదటిభాగాన్ని చదివిన వారి సంఖ్య 46. ఇది ఎక్కువంటే ఎక్కువ, తక్కువంటే తక్కువ.  మరొక నిరుత్సాహకర విషయం ఏమిటంటే మొదటి ఇరవైనాలుగ్గంటల్లోనే 35 మంది చదువగా మిగిలిన నాలుగురోజుల్లోనూ‌ పదకొండు మంది చదివారు! బాగుంది కదా. ఒకరోజులో నా టపాకు రమారమి ఇరవైమంది దాకా చదువరులు వస్తున్నారు. అందుచేత ఒకరకంగా ఒకరోజులో ముఫైయైదు అంటే ఎక్కువే. ఇకపోతే ఒక సాహిత్యప్రక్రియకు సంబంధించిన వ్యాసానికి కేవలం నలభైయారుమంది చదువరులు రావటం ఒకింత నిరుత్సాహం‌ కలిగించేదే మరి.  అన్నట్లు శంకరయ్యగారు దయతో తమబ్లాగులో వ్యాఖ్యానిస్తూ మిగిలిన కవిమిత్రులను కూడా చదువమని సూచించిన సంగతిని కూడా అనుసంధానం చేసుకొంటే ప్రజలకు ఛందస్సంబంధి విషయాలపై ఉన్న ఆసక్తి చక్కగా వెల్లడవుతున్నది కదా అనుకుంటున్నాను.  ఇక విషయానికి వస్తున్నాను.

ఆముక్తమాల్యద.
ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧. ౩ ధృతకులాయార్థ ఖండితసమిల్లవరూప
ఆము. ౧.౩ చరణాంతిక భ్రమ త్తరువరములు
ఆము. ౧.౩ దుందుభీకృత మేరు మందరములు
ఆము. ౧.౧౨ నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు
ఆము. ౧.౧౨ ఆయతంబగు కన్ను దోయితోడ
ఆము. ౧.౧౨ పులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు
ఆము. ౧.౧౨ హొంబట్టు జిఁగురెంటెంబు తోడ
ఆము. ౧.౧౨ లేములుడిపెడు లేఁజూపు లేమతోడఁ
ఆము. ౧.౧౩ రసికు లౌ నన మదాలసచరిత్ర
ఆము. ౧.౧౩ భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె
ఆము. ౧.౧౩ శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి
ఆము. ౧.౧౭ పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభి
ఆము. ౧.౧౯ అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు
ఆము. ౧.౧౯ పుట్టు కామని లేని మెట్టపంట
ఆము. ౧.౧౯ ఎవ్వాడు తొగకన్నె నవ్వఁజేయు
ఆము. ౧.౧౯ వేవెలుంగుల దొరజోడు రేవెలుంగు
ఆము. ౧.౨౭ వనజేక్షణామనోధన పశ్యతోహరుం(డు)
ఆము. ౧.౨౭ మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల(య)
ఆము. ౧.౩౦ అంభోరివసన విశ్వంభరావలయంబు
ఆము. ౧.౩౦ కకుబంత నిఖిల రాణ్ణికరంబుఁ జరణ మం(జీర)
ఆము ౧.౩౪ (భూమి)భృత్కటకం బెల్ల నెత్తువడియె యతిభంగం.
ఆము. ౧.౩౪ చారుసత్త్వాఢ్య యీశ్వరనారసింహ
ఆము. ౧.౩౪ పెంపుతో నీవు ధాత్రిఁ‌ బాలింపఁ గాను
ఆము. ౧.౩౬ తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి కెరలు నీ
ఆము. ౧.౩౬ కోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
ఆము. ౧.౩౬ అవుల నా పొట్నూర రవులుకొనియె
ఆము. ౧.౩౯ తను భృశ శ్రాంతవేష్టన లగ్నబర్హి బ(ర్హంబు)
ఆము. ౧.౩౯ గోప వేషంబు సెడి తొంటి భూపవేష
ఆము. ౧.౫౯ (అం)జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర
ఆము. ౧.౫౯ గవర లుంకించి వ్రేయఁ గొప్పవియు నవలి
ఆము. ౧.౫౯ కరమున నమర్పఁ బైఁటలో మరుని బటువు
ఆము. ౧.౬౦ (ని)గ్గులు దేరఁ బసుపిడి జలకమాడ
ఆము. ౧.౬౦ ముదుక గాకుండఁ బయ్యెదలోనె గేలార్చి
ఆము ౧.౬౦ కలయఁ జంటను వెంటఁ గలప మలఁద
ఆము. ౧.౬౦ (ముత్తె)ములు రాల గరగరికలు వహింపఁ
ఆము. ౧.౬౦ పొలసిననె యెట్టి నరునైనఁ గులముఁ తెలియఁ
ఆము. ౧.౭౬ నునుఁ బోఁక పొత్తిఁ గుట్టిన దొప్పగమితోడ
ఆము. ౧.౭౬ శాల్యన్య సూపాజ్య కుల్యాబహువ్యంజ(న)
ఆము. ౧.౮౫ ఇత్తెరంగున నవ్వైష్ణవోత్తముండు
అము. ౧.౮౫ జాగరూకత దైర్ధిక భాగవతుల
ఆము. ౧.౮౫ అలయ కవి పెట్టి సంతుష్టి సలుపుచుండె
మొత్తం ౮౯ గద్యపద్యాలు.


పంచకావ్యాలలో మూడవదైన రాయలవారి ఆముక్తమాల్యదా ప్రబంధంలో ప్రథమాశ్వాసంలో ప్రాసయతి నిర్వహణ చూసాం.  ఇందులో‌ హ్రస్వదీర్ఘాలసంకీర్ణత కొద్ది తావుల్లో వచ్చింది.  అవి

ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧.౧౭ పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభి
ఆము. ౧.౨౭ మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల(య)
ఆము. ౧.౭౬ శాల్యన్య సూపాజ్య కుల్యాబహువ్యంజ(న)
ఆము. ౧.౮౫ ఇత్తెరంగున నవ్వైష్ణవోత్తముండు

ఈ నాలుగు సందర్భాల్లోనూ ప్రాసస్థానంలో ఉన్నది ద్విత్వాక్షరమో సంయుక్తాక్షరమో, బిందుపూర్వకాక్షరమో కావటం గమనార్హం. అటువంటి సందర్భాల్లో తత్పూర్వాక్షరం ఎలాగూ‌ గురువే అవుతున్నది. అంతవరకూ చాలని రాయలవారి ఉద్దేశమా అన్నది ఆలోచనీయం. ఐతే ఈవిషయంలో మరింత లోతుగా - అంటే - ఆముక్తమాల్యద లోని మరికొన్ని అధ్యాయాలను కూడా పరిశీలించిన తరువాతనే ఒక అభిప్రాయానికి రావటం సబబు అనుకుంటాను.

మరొక సంగతి.  ప్రాసాక్షరం బిందుపూర్వకం ఐనప్పుడు పై ఉదాహరణల్లో ప్రాసయతికూడా బిందుపూర్వకం కావటం గమనార్హం. ఆ సందర్భాలు క్రింద విడిగా చూపుతున్నాను.

ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧.౩ దుందుభీకృత మేరు మందరములు
ఆము. ౧.౧౨ హొంబట్టు జిఁగురెంటెంబు తోడ
ఆము. ౧.౩౦ అంభోరివసన విశ్వంభరావలయంబు
ఆము. ౧.౩౪ పెంపుతో నీవు ధాత్రిఁ‌ బాలింపఁ గాను

ఈ విషయంలో కూడా ఏమైనా సంప్రదాయం ఉన్నదా అని కూడా చూదాం పనిలో పనిగా.