23, జూన్ 2016, గురువారం

ఫలించిన జోస్యం - 5 (నాగేంద్రుడి కథ)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం)

జ్యోతిషం చాలా పురాతనమైన శాస్త్రం.

దీని మూలాలు వైదికమైనవి.  మానవజాతికి అందిన విఙ్ఞానం‌ యొక్క అవతరణం వేదస్వరూపంగా జరిగిందని మన నమ్మకం. మన జీవనవిధానానికి మూలాధారం ఆ వేదమే.

ఈనాటి భౌతికవిఙ్ఞానపరిభాషలో విశ్వం యొక్క ఉనికి ఒక అనిర్వచనీయమైన మహావిస్ఫోటనంతో ప్రారంభం కావటం‌ జరిగింది.  అలా విస్ఫోటనం చెందినది ఏమిటీ అన్న ప్రశ్న వస్తుంది సహజంగా. దానికి సమాధానం మనకు తెలియదు. శాస్త్రపరిభాషలో చెప్పాలంటే ఇంకా తెలియదు. ఎందుకు ఆ విస్ఫోటనం‌ జరిగిందీ అంటే అదీ మనకు తెలియదు. కొన్ని సిధ్ధాంతప్రతిపాదనలు మాత్రం ఉన్నాయి. ఆ మహావిస్ఫోటనం జరుగక ముందు పరిస్థితి ఏమిటీ అన్న ప్రశ్న అసలు ఉత్పన్నమే‌ కాదు. ఎందుకంటే ముందు వెనుక అన్నవి కాలానికి సంబంధించిన ప్రాతిపదికలు. అసలు కాలం అనేదే లేదు. ఆ మహావిస్ఫోటనంతోనే‌ కాలం‌ అనేది ప్రారంభం అయ్యింది. మహావిస్ఫోటనం‌ యొక్క పరిణామం ఏమిటంటే అనంతమైన శక్తి విడుదలై అందులో కొంత పదార్ధ రూపం దాల్చింది. ఆ పదార్థం విస్తరించటానికి అనువుగా స్థలం అనే‌ ప్రమాణం ఏర్పడింది. ఆ శక్తిలో‌అధిక భాగం అంచనాకు అందటం‌లేదు. ఆ పదార్థంలోనూ‌ అధికభాగం మన అంచనాలకు అందటం లేదు. వాటి ఉనికిని మనం‌ పరోక్షంలో‌ ఒప్పుకోవటమే‌ కాని వాటి ఉనికిని పట్టి యిచ్చే ఏవిధమైన ఋజువునూ గుర్తించ లేకుండా ఉన్నాం. ఇంకా విస్తరిస్తూనే ఉన్నది విశ్వం వేగంగా - ఎంత వేగంగా అన్న విషయంలో మనం అంచనాలు వేయటమూ అవి తప్పని ఋజువై మరలా కొత్త అంచనాలకు రావటమూ జరుగుతున్నది. సమస్తమైన విశ్వానికీ దానిలోని సర్వప్రమాణాలకూ మూలాధారం ఆ మహావిస్ఫోటనమే. ఈ విధంగా ఒక ప్రారంభం అంటూ‌ ఉంది. దానినుండే సమస్తమూ కలిగింది.  మరి మహావిస్ఫోటనం చెందినది ఏమిటీ అంటే అది అనిర్వచనీయంగా ఉంది కాని మన మస్తిష్కానికి అందకపోయినా మన సిధ్ధాంతాలకు అందక పోయినా అదేదో ఉండనే ఉందిగా. ప్రస్తుత విఙ్ఞానశాస్త్రం దానిని నిర్వచించలేక పోయినంత మాత్రాన అది లేదనేందుకు వీల్లేదు కదా.
 
అలాగే మన సనాతనధర్మం యొక్క నమ్మిక ప్రకారం అనిర్వచనీయమైనది భగవత్తత్త్వం. దాని వలననే ప్రకృతి యేర్పడింది. ఆ ప్రకృతియే విశ్వంగా పరిణామం చెందింది. భగవత్తత్త్వం ఋషులకు విఙ్ఞాన రూపంగా భాసిల్లింది. అదే వేదం. సమస్తమైన జీవనతత్త్వానికీ అదే అధారం. ఈ భగవత్తత్త్వమూ మన తెలివిడికీ సిధ్ధాంతాలకూ అందదు. భౌతికవిఙ్ఞానశాస్త్రం దాని గురించి ఏమీ చెప్పలేదు. ఉందనీ‌ చెప్పలేదు - లేదనీ‌ చెప్పలేదు. సైంటిఫిక్ ఋజువులు లేవు కాబట్టి భగవత్తత్త్వం అనేది ఉండటానికే వీల్లేదంటే అలా అనేవారి విఙ్ఞతకు ఒక నమస్కారం చేసి ఊరుకోవటమే.

ఆ వేదాన్ని ఋషులు ఆరు అంగాలు కలిగిన దానిగా వర్గీకరించారు. ఆ వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం‌, కల్పం అనేవి. అందుచేత జ్యోతిషం వేదంలో భాగంగానే వచ్చింది. అందుచేత వేదప్రామాణ్యత కలది. కాలస్వరూపాన్ని తెలియజేసేది జ్యోతిషం.

జ్యోతిషాన్ని లోకంలో అనేకులు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కరెన్సీ నోట్లతో మంటవేసి టీ‌ కాచుకోవటం ఆ నోట్లకు అధమప్రయోజనం‌ కదా. జ్యోతిషంతో కాలస్వరూపాన్ని గ్రహింపు చేసుకొని లోకోపకారం చేయ గలిగితే అది సరైన ప్రయోజనం. ఇతర వినియోగాలు వర్జనీయాలే. ఉత్తములు జ్యోతిషాన్ని సరిగానే వినియోగిస్తారు. కాని వారు అరుదుగా కనిపిస్తారు.

కృష్ణమూర్తి పధ్ధతికి చెందిన జ్యోతిషపత్రిక ఒకటి ఒక కథనాన్ని ప్రకటించింది. ఎప్పటి మాటో చెబుతున్నాను లెండి. ఆ కథనంలో జ్యోతిషం తెలిసిన ఒకాయన పనిమనిషి రాకకోసం వేచి చూడవలసి వచ్చిందట ఒకనాడు. అమె రాక ఆలస్యం అవుతుంటే అమె ఎప్పుడు వచ్చేదీ తెలుసుకొనేందుకు చక్రం వేసి వివరాలు పరిశీలించాడట. అధ్బుతం! అమె సరిగ్గా అతను లెక్కగట్టినట్లుగానే అన్ని గంటల అన్ని నిముషాల అన్ని సెకనులకే అమె ఇంటిలోనికి ప్రవేశించిందట.

మరొక పత్రికలో ఒక పెద్దమనిషి జ్యోతిషం ఉపయోగించి వరసగా కొన్నాళ్ళపాటు రేసుల్లో ఏఏ గుఱ్ఱాలు గెలిచేదీ సరిగ్గా లెక్కకట్టాడట. ఆ వివరాలతో ఒక వ్యాసం.

ఇవి దిక్కుమాలిన ప్రయోజనాలు కదా!

బి.వి.రామన్ గారి అష్ట్రలాజికల్ మేగజైన్‌లో ఒకప్పుడు వచ్చిన ఒక వ్యాసంలో డాక్టరుగారు ఒకాయన గుండెజబ్బు లున్న కొందరు రోగుల జాతకచక్రాలను పరిశీలించి కొన్ని కాంబినేషన్లు ప్రకటించాడు. అవి ఆసక్తి కరంగా ఉన్నాయి. వాటిలో ఒక కాంబినేషన్ కనిపించిన పిల్లవాడికి గుండెలో రంధ్రం ఉన్నదని స్వయంగా నా అనుభవంలో తెలుసుకోవటం జరిగింది.

ఇటువంటి పరిశోధనలు మానవాళికి ఉపయోగిస్తాయి. కొందరు అలాంటి పరిశోధనలు చేస్తున్నారు. అది మంచిదే.

కాలస్వరూపాన్ని ఇలా కొందరు జ్యోతిషం ఆధారంగా తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు సద్వినియోగం చేస్తున్నారు.

కాని కొందరు మహానుభావులకు వారి వారి యోగశక్తిని అనుసరించి కాలస్వరూపం అవగతం అవుతూ ఉండటం జరుగుతుంది. అలాంటి వాళ్ళని త్రికాలవేదులు అంటున్నాము. అలా త్రికాలవేదులం‌ కాము కాబట్టి మనబోటి వాళ్ళం జ్యోతిషాన్ని ఆశ్రయిస్తున్నాం. సద్బుధ్ది ఉంటే సద్వినియోగమే చేస్తున్నాం.

త్రికాలవేదులం అని డప్పువేసుకొనే వారు కచ్చింతంగా బోగస్ అయ్యే అవకాశం ఉంది. నిజమైన త్రికాలవేదికి మన పొగడ్తలతో పనిలేదు కదా. కరుణతో ఎవరికన్నా ఉపకారం చేయాలని భగవత్సంకల్పంగా వారికి మనస్సులకు సందేశం అందితే వారి వలన అటువంటి లోకోపకారం జరుగుతుంది.

వేదం ట్రాష్. జ్యోతిషం ట్రాష్. యోగం‌ ట్రాష్. కాలం‌ తెలియటం ట్రాష్ అనే గొప్ప తెలివిడితో మసలుకొనే మహానుభావులు కూడా ఉంటారు లోకంలో. వాళ్ళు ఇదంతా నమ్మరు. నేను వ్రాస్తున్నది ఒకరిని నమ్మించటానికో ఒకరిని మోసగించటానికో కాదు. నా జీవితానికి సంబంధించిన సంఘటననల గురించి వ్రాస్తున్నాను. ఎందుకు వ్రాస్తున్నానూ‌ అంటే అందరికీ సంతృప్తి నిచ్చే సమాధానాన్ని నేను చెప్పలేను. నా తృప్తి కోసమే వ్రాస్తున్నాను. కాని ఆ మాట వెనుక ఏమన్నా వేరే ప్రయోజనం దాగుందా అంటే ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి తలొక వంద నమస్కారాలూ చేయటం మినహా మరేమీ చేయలేను.

నమ్మే వారిని నమ్మించటానికి ఉన్నవీ లేనివీ చిలువలు పలువలుగా చిత్రించి వ్రాయటానికి నాకు అవసరం ఏమీ‌ లేదు. నమ్మని వారితో నాకు తగాదా యేమీ లేదు. చదవటం చదవక పోవటం ఎప్పుడూ వ్యక్తుల ఇష్టమే కాని వ్రాసేవాడి బలవంతం ఏమీ ఉండదు కదా. ఈ ముక్కలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నానూ‌ అంటే ముందు జాగ్రత్త కోసం అన్నమాట. అదేం‌ అలా అన్నావూ‌ అనకండి దయచేసి.  ఇంక కథ లోనికి వధ్దాం.

అటువంటి త్రికాలవేది ఒక సాదువు ఆ యింటి గుమ్మం వద్దకు వచ్చాడు.
ఆ యింటి ఇల్లాలు బిక్ష ఇవ్వటం కోసం బయటకు వచ్చింది.

అది లక్ష్మీపోలవరం అనే గ్రామం. శ్రీజగన్మోహినీకేశవస్వామివారు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన ర్యాలికి ప్రక్కనే ఉన్న ఊరు.

ఆ యూళ్ళో వీరి యిల్లు గ్రామం మధ్యలో ఉన్న ఒక వీధిలోని మూడిళ్ళలోనూ మధ్యయిల్లు.

ఆ యిల్లాలి నుండి భిక్షను స్వీకరించిన సాధువు, ఇలా అన్నాడు

అమ్మా నీవు సంతానం కోసం పూజలు చేస్తున్నావు. అవి ఫలోన్ముఖం అయ్యే రోజులు వచ్చాయి. మీ యిలవేలుపు నాగేంద్రుడు.  అయన కటాక్షం కోసం ప్రార్థించు. త్వరలోనే మీకు ఆయన దర్శనం అనుగ్రహిస్తాడు. మీ దంపతులు శయనించి ఉండగా ఒకనాడు ఆయన మీ పడక మీదనే దర్శనం ఇస్తాడు. మీరు ఏదో పాము పాము అని భయంతో గడబిడపడి ఆ సర్పానికి హాని చేయటానికి ప్రయత్నించవద్దు. మీకు కలగబోయే కుమారుడికి స్వామి నామధేయం ఉంచుతామని దండం పెట్టుకొని విన్నవించుకోండి. నేను మీకు ఈ మాటలు చెప్పటానికే వచ్చాను.

ఈ మాటలు చెప్పి ఆ సాధువు ఎవరో తన దారిన తాను పోయాడు.

ఆమెకు చిత్రంగా అనిపించాయి ఈ మాటలు.

భర్తగారు ఇంటికి వచ్చాక జరిగిన సంగతిని ఆవిడ ఆయనకు పూసగ్రుచ్చినట్లు చెప్పింది.

ఆయన ఆశ్చర్యపోయాడు.

సాధువుగారు చెప్పినట్లే ఒక నాడు వారికి పడక గదిలోనే వారి పట్టెమంచం మీదనే ఒక పెద్ద తెల్లని సర్పం హఠాత్తుగా దర్శనం ఇచ్చింది. నిద్రలో ఉన్న వారికి తమ మీదుగా సర్పం ఒకటి ప్రాకుతూ వెళ్ళటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. పామును చూసి వాళ్ళిద్దరూ భయంతో కొయ్యబారి పోయారు.

కాని వారికి సాధువుగారి జోస్యం గుర్తుకు వచ్చి చెరియొక వైపునకూ మంచం దిగి నమస్కారం చేసుకున్నారు కొంచెం వణుకుతూనే.  ఆయన సూచించినట్లే చెప్పుకున్నారు కోరస్‍గా.
 

ఆ సర్పం తన దారిన తాను వెళ్ళిపోయింది మంచదిగి కిటికీ గుండా.

ఒక పెంకుటింట్లో అటకమీద ఎలకలూ గట్రా తిరుగుతూ ఉంటాయి కదా, పాములు చేరటంలో ఆశ్చర్యం ఏముందీ అనవచ్చును. అలాగే అటక మీదినుండి క్రిందపడో క్రిందికి దిగివచ్చో ఒక పాము కిటికీ గుండా పడకగది లోనికి రావటమూ విశేషం కాదనీ అనవచ్చును. కాని త్వరలో ఇలా జరుగుతుందనీ, దండం పెట్టుకుంటే అది ఏహానీ చేయకుండా వెళ్ళిపోతుందనీ, ఆ తరువాత మాత్రమే కొన్నాళ్ళకు తప్పకుండా సంతు కలుగుతుందనీ ఎవరో వచ్చి జోస్యం చెప్పటం విశేషమే తప్పకుండా. కాదంటారా?

ఈ సంఘటన జరిగిన తరువాత కొంతకాలానికి వారికి పుత్రోదయం ఐనది.

ఈ విధంగా తాడిగడప బాపిరాజుగారికి పెద్ద కుమారుడు వేంకట సుబ్బారావుగారు జన్మించటం జరిగింది.

ఈ సుబ్బారావుగారు మా తాతగారు. ఆ బాపిరాజుగారు మా ముత్తాత గారు.

బాపిరాజు గారు కాటన్ దొర వధ్ద ఒక ముఖ్య సర్వేయరుగా ఉద్యోగం చేసారట.

మా అత్తగారు చాలా ఊళ్ళు తిరిగారు. ఆవిడకు చాలా భాషలే వచ్చును అని మా బామ్మగారు నాతోనే స్వయంగా చెప్పారు. మా బామ్మగారు కానీ మా అమ్మగారు కానీ బాపిరాజుగారి భార్యపేరు చెప్పలేదు. కొంచెం పరిశోధించి తెలుసుకోవాలి. తెలియవస్తే ఈ టపాను సరిచేస్తాను ఆ వివరంతో.

మా కుటుంబంలో ప్రతితరంలోనూ సంతానంలో ఒకరి కైనా  తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరు పెట్టుకోవాలని మా అమ్మగారు  హెచ్చరిస్తూ ఉండేవారు. మాతరంలో పాటించాం. మా చెల్లెలు ఒకామె పేరులోనూ ఒక తమ్ముడి పేరులోనూ సుబ్రహ్మణ్యస్వామి సూచకమైన నామం ఉంచటం జరిగింది. ముందు ముందు కూడా అలాగే జరుగుతుందని విశ్వసిస్తున్నాను.

కాలం గడిచిన కొద్దీ తరాలు మారి ఈ నాటికి మా కుటుంబాల్లో సుబ్రహ్మణ్యుడి పట్ల కొంచెంగా భక్తిశ్రధ్దలు తగ్గాయా అన్న అనుమానం వస్తున్నది. ఒకప్పుడు మా యింట్లొ ప్రతి నాగులచవితినీ చాలా నిష్ఠగా జరుపుకునే వాళ్ళం. సుబ్బారాయడి షష్ఠి మరొక కోలాహలమైన పండుగగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యపరిస్థితుల కారణంగా మా యింట్లో ఉపవాసాలు లేవు. పట్నవాసం మిషతో ఆ రెండు పండగలూ పెద్దగా జరుగుతున్నదీ లేదు. ఇది అసంతృప్తిని కలిగిస్తోంది నాకు.

ఇప్పటికే టపా పెద్దదయ్యింది. ఇంకా కొంత విషయం ఉంది ఈ సందర్భం గురించి. అది వచ్చే టపాలో చూదాం.



( ఆరవభాగం)