29, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 22 భవాని త్వం ....



మొదటి శ్లోకంవెనుకటి భాగంతదుపరి శ్లోకం

22


భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంచన్ కథయతి భవాని త్వమితి యః
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటముకుటనీరాజితపదామ్


ఈ శ్లోకంలో శ్రీశంకరులు అమ్మను స్మరించటం అనేది ఎంత మహత్తరమైన ఫలితాన్నిస్తుందో తెలియ జేస్తున్నారు.

యః అంటే ఏ భక్తుడైతే భవాని త్వం దాసే, మయి సకరుణా దృష్టిం వితర అని  అనగా అమ్మా భవానీ త్వం అనగా నీకు దాసే అనగా దాసుడను ఐన మయి అంటే నాయందు సకరుణా అనగా కరుణ కలిగి దృష్టిం అనగా కనుచూపును వితర  అంటే ఇవ్వమ్మా అని ఇతి స్తోతుం వాంఛతి ఈ విధంగా ప్రార్థించాలని కోరుకుంటూన్నాడో  అని అటువంటి వాడికి అమ్మ అనుగ్రహం ఎంత విశేషంగా లభిస్తోందో చెనబుతున్నారు.

ఇలా ఒక భక్తుడు అమ్మను ఉద్దేశించి ప్రార్థించటానికి పూనుకున్నాడు. కథయతి భవాని త్వం ఇతి అంటే భవానీ నీవు అని ఇలా తస్న్మై తదైవ అంటే ఆ మాటను అలా పలకటం మొదలు పెట్టగానే గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తున్నావు అంటున్నారు.  అది ఎటువంటి భాగ్యమో చూడండి శ్రీశంకరులు చెబుతున్నారు.

అమ్మ పాదాలు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజితములు.  అంటే అమ్మ పాదాలకు నిత్యం విష్ణువూ, బ్రహ్మ గారూ, ఇంద్రుడూ నమస్కారాలు చేస్తూ ఉంటే వారి స్ఫుట ముకుటములు అంటే వారి నెత్తిన ఉన్న మణి ప్రభలతో వెలిగిపోయే కిరీటాలు కూడా అమ్మ పాదాలకు మణిహారతులు ఇస్తూ ఉంటాయి అని శ్రీ శంకరులు చెబుతున్నారు.

అటువంటి వైభవం కలిగిన అమ్మ పాదాల నిజ సాయుజ్య పదవీం అనగా తన యొక్క పాదాల సాయుజ్యాన్ని ఆ భక్తుడికి దిశతి అనగా అనుగ్రహిస్తున్నదట.

ఇక్కడ ఒక చమత్కారం గమనించండి నిత్యం నమస్కారాదులు చేస్తూ స్తోత్రపాఠాలు చేస్తున్నా బ్రహ్మాదులకు అమ్మ సాయుజ్యం ఇవ్వనే లేదు. కాని అమ్మా నువ్వు అంటూ ఒక భక్తుడు స్తోత్రం చేయబోగానే అతడికి ఏకంగా సాయుజ్యం అనుగ్రహించింది. అదీ అమ్మ యొక్క కరుణావిశేషం.

మరొక ముఖ్యమైన సంగతిని కూడా ఇక్కడ శ్రీశంకరులు తెలియజేసారు. భవాని త్వం అనగానే అమ్మ వేంఠనే సాయుజ్యం ఇచేస్తోంది అని. ఎందుకంటే ఇక్కద భవానిత్త్వం అన్నదానిలో శ్రీశంకరులు తత్త్వమసి అనే మహావాక్యం స్ఫురిస్తోంది అని చెబుతున్నారు.  ఈ  "తత్త్వం అసి" , " అనే మహా వ్యాక్యం యొక్క్ అర్థం నేను నీవే అవుచున్నాను అని అనటం. కాబట్టి భక్తుల కోరిక తీర్చే కరుణామూర్తి ఐన అమ్మ అలాగే నాయనా అని వెంటనే తనతో ఏకత్వాన్ని అనుగ్రహించేస్తోందిట, భక్తుడి ఇలా స్తోత్రం చేయాలని మొదలు పెట్టగనే,

ముక్తి ప్రథానంగా నాలుగు రకాలు, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని.  వీనిలో ఒకదానికంటే దానితరువాతది ఉత్తమం అన్నమాట. సాలోక్యం అంటే భగవంతుడు ఉండే లోకం చేరుకోవటం. సామీప్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి సేవచేయగలగటం, సారూప్యం అంటే ఇష్టదైవం రూపాన్ని పొందటం. సాయుజ్యం అంటే ఏకంగా ఇష్టదైవంలో లీనం ఐపోవటం.  ద్వైతులకు ఇష్టమైనది సామీప్య ముక్తి. విశిష్టాద్వైతులకు ప్రీతికరమైనది సారూప్య ముక్తి, అద్వైతులకు సాయుజ్యమే కోరిక.

భాగవతపురాణంలో కూడా అజామీళుడు కేవలం నారాయణా అని నామస్మరణం చేసినంత మాత్రానే ఆయన ముక్తిని అనుగ్రహించాడని కథనం ఉంది కదా. ఇంతకూ అజామీళుడు పిలచినది శ్రీమన్నారాయణమూర్తిని కాక కేవలం తన కుమారుణ్ణే. ఐనా సరే ఆ నామస్మరణమే అతడికి ముక్తిని ఇవ్వగలగింది.  కలౌ స్మరణా న్ముక్తిః అని సూక్తి.

ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైఐదు రోజులు పారాయణం. నైవేద్యం తేనె, పాలు, త్రిమధురం, పాయసం. ఫలం ఇహలోకవాంఛాపరులకు సర్వవైభవాలతో జీవితం, ముముక్షువులకు అమ్మ అనుగ్రహంతో సాయుజ్యం.