16, ఆగస్టు 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 199

భక్తిపూర్వకంగా శ్రీరామచంద్రులవారికి మానసిక పూజ సమర్పించుకున్నాం.
మనిషి మనసు ఒక కోతి వంటిది.  ఎంత శ్రధ్ధగా పూజచేసుకుంటున్నా అది అప్పుడప్పుడూ చెప్పాచెయ్యకుండా మధ్యమధ్యలో షికారుకు పోతూ ఉంటుంది.  మనం గమనించుకుని, మనస్సుని అదిలించి అదుపులో పెట్టుకుని పూజా కానిస్తాం.  ఇలా జరగటం సాధారణమే.  కాని శ్రధ్ధాలోపం శ్రధ్ధాలోపమే.  అదీ కాక మనం ఎంత భక్తితో చేస్తున్నామని భావించుకున్నా, మన భగవద్విశ్వాసం అనేది అత్యంత పరిపూర్ణం అని గుండెలమీద చేయి వేసుకుని చెప్పుకోగలమా?  చెప్పుకోలేం కదా?  అలాంటప్పుడు పూజలో ఎంతో కొంత భక్తిలోపమూ జరుగుతున్నట్లే కదా?

ఇలా భక్తిశ్రధ్ధలలో మన ప్రమేయం లేకుండానే లోపం జరుగుతూనే ఉంటుంది.
విచారించవలసిన పని లేదు.
ఇలా (మానసికంగా) పూజ చేయగా చేయగా మనం ఈ‌ భక్తిశ్రధ్ధల విషయంలో పురోగతి సాధిస్తాం.

ప్రస్తుతానికి మన శ్రధ్ధాభక్తుల లోపానికి గాను భగవంతునికి క్షమాపణ చెప్పుకోవటం పూజ చివరలో తప్పకుండా చేయాలి.

క్షమాప్రార్థన.

క. మనసున భక్తిశ్రధ్ధలు
తనరారగ పూజ సేయ దలచితి నైనన్
పనవుదు తప్పులు దొరలుట 
గని మానవుడను గద దయగనుమా రామా

తాత్పర్యం. ఓ‌ శ్రీరామచంద్రా,  మనస్సునిండా భక్తీ శ్రధ్దా నిండి ఉండగా నీకు పూజ చేసుకుందామని తలిచాను. అయినా తప్పులు దొర్లటం వలన చాలా విచారం కలుగుతోంది. మానవుణ్ణి కదా. నన్ను దయతలచు.  క్షమించి, ఈ పూజను స్వీకరించి కృతార్థుడిని చేయవలసింది.

(ఆగష్టు 2013)