27, జులై 2013, శనివారం

పాహి రామప్రభో - 180

భగవంతుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లితో కూడి మనస్సనే దివ్యసింహాసనంలో కూర్చున్నాడు సంతోషంగా.  అలా భావించుకున్న తరువాతి ఉపచారంగా,  మనం దేవుడి పాదాలకు పాద్యం సమర్పించుకోవాలి.  అంటే సంతోషంగా చక్కగా దేవుడి పాదాలను కడగాలి.

పాద్యం

కం. ఏ కాళ్ళు గంగ పుట్టి
ళ్ళా కాళ్ళను కడుగ నెలమి నడిగెద తండ్రీ
నా కీ భాగ్యము నిమ్మా
శ్రీకర కరుణాలవాల సీతారామా


తాత్పర్యం. తండ్రీ సీతారామచంద్ర ప్రభూ. ఏ కాళ్ళనుండి గంగ జన్మించిందో,  అ దివ్య పాదాలను ప్రేమతో కడిగే భాగ్యం ప్రసాదించండి. మీరు ఎంతో దయగల వారు.  మీరు సాక్షాత్తూ మోక్షాన్ని ప్రసాదించేవారు.  అలా అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయండి.  (శ్రీమహావిష్ణువే శ్రీరాములవారు. శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదం‌ బ్రహ్మలోకాన్ని సమీపించగానే ఆశ్చర్యానందాలతో బ్రహ్మదేవుడు తన తండ్రి పాదాలను, తన కమండలంలోని జలంతో కడిగి ధన్యుడయ్యాడు. ఆ జలమే గంగ అనే పేర దివ్యనది అయింది.)

(జూలై 2013)